అమరావతి : రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను వాలంటీర్లు అక్రమరవాణా చేస్తున్నారని ఆరోపించడం దారుణమని అన్నారు. వాలంటీర్ల గురించి తెలియని పవన్ కల్యాణ్ రాజకీయ స్వార్థం కోసం ఇష్టారీతిన వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తి వాలంటీర్ల వ్యవస్థల గురించి తెలుసుకోకుండా అనాలోచిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే వాలంటీర్లను క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో 15వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే రెండు లక్షల 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. వీరిలో సగం మంది మహిళా వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. రాజకీయం, ప్యాకేజీల కోసం మీ మదర్ను, ఫ్యామిలీని జనసేన నాయకులను తిట్టిన వారిని వెనకేసుకు రావడం అతడికే చెల్లిందని విమర్శించారు. వారాహి అనే అమ్మవారి పేరిట చేపట్టిన వాహనంపై చెప్పులు వేసుకుని, ఇష్టారీతిన ప్రత్యర్థులను తిట్టడం శోచనీయమని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో పెట్టుకున్నా చంద్రబాబును సీఎంగా చేయలేవని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను తిట్టే అర్హత పవన్కు లేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి తెలుసుకోకుండా అజ్ఞానిలో పవన్ మాట్లాడుతున్నాడని మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకు పడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివి అబాసు పాలవుతున్నాడని ఆరోపించారు.