అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ తన ఇల్లు కూడా ఉందని జగన్ పేర్కొన్నారు.
మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకునే ప్రకటనకు ముందు జగన్ శాసనసభలో మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్ణయం వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ వివరించారు. హిస్టరీ అంతా చెప్పారు. 1953 నుంచి 56 దాకా, ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూల్ ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. 1956లో కర్నూల్ నుంచి రాజధాని కానీ, గుంటూరు నుంచి హైకోర్టు కానీ.. రెండు కూడా హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని శ్రీబాగ్ ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారు అని జగన్ గుర్తు చేశారు.
ఇక ఈ ప్రాంతంలో రాజధానితో పాటు ఇతర అంశాలపై చంద్రబాబు హయాంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. 50 వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. ఇక్కడ నాకు ఇల్లు కూడా ఉంది. అమరావతికి గుంటూరు, విజయవాడ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్లు, కరెంట్, డ్రైనేజీ అయ్యే ఖర్చు.. ఎకరాకు రూ. 2 కోట్లు అని లెక్కలు లేశారు. లక్ష కోట్ల ఖర్చు చేశారు. ఓ పదేండ్లు పోతే ఈ లక్ష కోట్ల విలువ.. ఆరేడు లక్షల కోట్లు అవుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు ఇక్కడి పిల్లలు వెళ్తున్నారు. విశాఖపట్టణం పెద్ద సిటీ. రోడ్లు ఉన్నాయి. డ్రైనేజీ, కరెంట్ ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సుందరీకరణపై దృష్టి సారించి ఉండి ఉంటే.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే అవకాశం ఉండేది.
రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాలని, కర్నూల్లో హైకోర్టు పెట్టాలని నిర్ణయించాం. వికేంద్రీకరణతో మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశాం. ఈ నిర్ణయాలను రకరకాలుగా వ్యతిరేకించారు. న్యాయపరమైన చిక్కులను సృష్టించారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది అని జగన్ పేర్కొన్నారు.