AP News | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. భవిష్యత్తుపై గ్యారంటీ లేకనే చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా లోకేశ్ గతంలో ఏం చేశారో.. గెలిస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పడం లేదని అన్నారు. కేవలం వైసీపీ అధినేత జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తు లేని చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తాడా అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఓటుకు నోటు స్కాంలో దొరికిపోయి.. పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను వదిలిపెట్టి రాత్రికి రాత్రే పారిపోయి ఆంధ్రాకు వచ్చారని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అంటూ నారా లోకేశ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని.. చిత్తూరు జిల్లాలో తన పేరే మొదటిది అని అంటున్నాడని తెలిపారు. నారా లోకేశ్ బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడవని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో గెలిచినప్పుడు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మరోసారి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు రెడీ అయ్యాడని విమర్శించారు. 14 ఏండ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పాలనలో చెప్పుకోవడానికి ఏ ఒక్క పథకం అయినా ఉందా అని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కు మాత్రమే దక్కుతుందని అన్నారు.
చంద్రబాబు బీసీల ద్రోహి అని మంత్రి చిల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తన హయాంలో ఫీజు రీయింబర్ష్మెంట్ను సగానికి తగ్గించారని అన్నారు. బీసీలకు ఉన్నత విద్యను దూరం చేశారని మండిపడ్డారు. కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలన్నదే బాబు ఆలోచన అని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు.