గుంటూరు : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను తెలుసుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థుల కుటుంబసభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.
కృష్ణా నదిలో ఈతకు దిగి విద్యార్థులు మరణించటం దురదృష్టకరమని మంత్రి సురేశ్ అన్నారు. సంఘటన పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి సురేష్.. విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందటం విచారకరమన్నారు.
మృతులు హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమన్ శుక్లా, శివ శర్మ, నితేష్ కుమార్ దీక్షిత్గా గుర్తించగా వారి కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.