AP News | ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందని ఆయా పార్టీల అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే స్పందించారు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ 2014 ఫలితాలు మళ్లీ రిపీట్ కానే కావని స్పష్టం చేశారు.
2014 ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు అని వివరించారు. అప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో పాలనలో అనుభవం ఉన్న నాయకుడు అని చంద్రబాబును ప్రజలు గెలిపించారని అన్నారు. నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ చరష్మా కూడా చంద్రబాబుకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అందుకే చంద్రబాబు ఎన్ని పార్టీలను కలుపుకున్నా ఫలితం ఉండదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని గుర్తు చేశారు. ఈ సమయంలో చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే మైనస్ అని అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు అని విమర్శించారు. ఏపీలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీకి జరిగే నష్టమేమవీ లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ను మంచి చేసే నాయకుడిగా నమ్ముతున్నారని తెలిపారు.