Nara Lokesh | లిక్కర్ మాఫియాకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి.. మద్యం తయారు చేసి.. మద్యం అమ్మి, దాని మీద వచ్చే ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా అని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారని విమర్శించారు. ఈ మేరకు జగన్ను ప్రశ్నిస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పలు ప్రశ్నలను సంధించారు.
ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని, జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. మీరు కొత్తగా తెచ్చిన మద్యం పాలసీ వల్ల 72 శాతం అమ్మకాలు పెరిగాయి. విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు. సగటున మద్యం సేవించే వారి సంఖ్య 2019-2020 మధ్యన 5.55 నుంచి 6.23 శాతానికి పెరిగింది. రేట్లు పెంచి లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ భారీగా వినియోగం పెరిగింది. ఇదేనా సైకో జగన్, నువ్వు చెప్తున్న నీ గొప్ప లిక్కర్ పాలసీ ? రూ.50 మందు రూ.250కి అమ్మిన నువ్వు చేసింది మద్యం వ్యాపారం. ఈ నకిలీ మద్యం తాగి ఎంత మంది చనిపోయారో, మన ఊరిలో మన కళ్ల ముందే అనేక మంది కనిపిస్తున్నారు. ఇక ఇంత రేటు పెట్టి మద్యం తాగలేక గంజాయికి, నాటు సారాకి బానిసలు అయ్యారు. ఈ పాపానికి కారణం నువ్వు కాదా ? అని జగన్ను నారా లోకేశ్ ప్రశ్నించారు.
ఐదేళ్ల పాటు అమ్మిన మద్యానికి డిజిటల్ చెల్లింపుల్లో కాకుండా కేవలం నగదు రూపంలో విక్రయించి రూ. 99,413.50 కోట్లు తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపుల రూపంలో కేవలం రూ.615 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ రోజుల్లో తోపుడు బండ్ల వాళ్లు కూడా ఆన్ లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం అసలు ఆన్ లైన్ పేమెంటు అనేదే లేకుండా చేశారు. బిల్లు ఇవ్వండని అడిగిన వారిని అరెస్టులు చేశారు. ఈ డబ్బు మొత్తం నీ తాడేపల్లి కొంపకి తరలించింది వాస్తవం కాదా ? నువ్వు అధికారంలోకి రాగానే, డిస్టిలరీస్ అన్నీ మిథున్రెడ్డి చేతిలోకి వెళ్లింది వాస్తవం కాదా ? తయారీ నుంచి సరఫరా వరకూ విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, చెవిరెడ్డి, సుబ్బారెడ్డి అయితే వెనుక ఉన్నది నువ్వు కాదా జగన్ రెడ్డి ? 2019లో నువ్వు వచ్చిన తరువాత తెచ్చిన మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అని నారా లోకేశ్ అన్నారు.
మీ దోపిడీ కోసం బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏపీ బేవరేజేస్ లో వంద కంపెనీలు మద్యం తయారు చేస్తుంటే అందులో 74% మద్యాన్ని నాటి నీ ప్రభుత్వం కొనుగోలు చేసింది 16 కంపెనీల నుంచి. అవన్నీ నీ బినామీ కంపెనీలే కదా ? రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) అని వసూలు చేశావ్. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్లిందో, ఇప్పటికీ తెలియడం లేదని నారా లోకేశ్ విమర్శించారు.
2014-19 మధ్య 31 బ్రాండ్ల లిక్కర్ బాటిల్ ధర రూ.50 నుంచి రూ.70 మధ్యనే ఉండేది. 2019-24 మధ్య ఆ బ్రాండ్లన్నీ రద్దు చేసి కేవలం 2 బ్రాండ్లకు సంబంధినవి విక్రయించారు. ఆదాన్, గ్రేసన్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ ఇలా పలు కంపెనీలు 2 వేల లక్షల లీటర్లు విక్రయించి రూ.20,356 కోట్లు ఆర్జించాయి. తక్కువ నాణ్యత గల లిక్కర్ ను సరఫరా చేశారు. ఇది నీ దోపిడీ కాక ఇంకేంటి అని జగన్ను నారా లోకేశ్ నిలదీశారు. నీ నాసిరకం జే-బ్రాండ్స్ తాగి, 2019-24 మధ్య కిడ్నీలు పాడైనవారు 52 శాతం, ఊపిరితిత్తులు పాడైనవారు 54 శాతం పెరిగారు. ఇది నువ్వు తెచ్చిన జే-బ్రాండ్స్ విషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను దోపిడీ చేసే నీ మద్యం పాలసీ రద్దు చేసి, నూతన మద్యం విధానానికి శ్రీకారం చుట్టాం. 3,736 ప్రైవేటు రిటైల్ షాపులకు టెండర్లు పిలిస్తే, 90 వేల మంది వచ్చారు. రూ.1800 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. పారదర్శకంగా లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరిగింది. ఇది మా విధానమని నారా లోకేశ్ తెలిపారు. గీత కులాల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తూ, గీత కులాలకు 340 షాపులు కేటాయించామన్నారు. నీ లాగా షాపులు తీసుకుని వెళ్లి మిథున్ రెడ్డి చేతిలో పెట్టలేదు. ఇది మా విధానం అని స్పష్టం చేశారు.
అక్రమ, కల్తీ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా ఏపీ నూతన మద్యం విధానం తెచ్చామని నారా లోకేశ్ అన్నారు. సామాన్యుల కోసం చౌక ధరకు క్వాలిటీ మద్యం రూ.99 కంటే తక్కువ ధరకే జాతీయ స్థాయి బ్రాండ్ మద్యం అందిస్తున్నామన్నారు. నీలాగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ, సొంత బ్రాండులు దింపలేదని తెలిపారు. ఇది మా విధానం అని స్పష్టం చేశారు.
మద్యం కనీస ధరలను నిర్ణయించడానికి 90 రోజులలోగా టెండర్ కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. పొరుగు రాష్ట్రాల మద్యం ధరల ఆధారంగా ఏపీ మద్యం MRP ఉంటుంది. నీ లాగా రూ.50 మందు రూ.250కి అమ్మటం లేదు. ఇది మా విధానం అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యం, క్షేమం ప్రాధాన్యంగా ఏపీ నూతన మద్యం విధానం ఉంటుంది. 2 శాతం డ్రగ్ కంట్రోల్/ రిహాబిలిటేషన్ సెస్ వేస్తున్నాం. ఈ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మత్తు పదార్థాల నియంత్రణ, డి-అడిక్షన్ కేంద్రాల నిర్వహణ, కౌన్సిలింగ్ మొదలైన వాటి కోసం వినియోగిస్తారు. సుమారుగా రూ.90 నుంచి 100 కోట్లు ఇందుకోసం కేటాయిస్తారు. నీ లాగా తాగి ఊగమని ప్రమోట్ చేయం. ఇది మా విధానం అని వ్యాఖ్యానించారు.