అమరావతి: ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని కోర్టు తెలిపింది. శాసనసభకు లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని, శాసన అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని తీర్పు నిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ సీఎం జగన్తో సమావేశం అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు తీర్పు మేం ఊహించిందేనని, తీర్పులో కొత్తదనం ఏమీ లేదని పేర్కొన్నారు. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని, శాసనసభలో చట్టాలు చేయకూడదంటే ఎలా అని అన్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని, తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతామని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుకు ఈ క్షణం వరకు కట్టుబడి ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్ధేశమని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ విధానమన్నారు.
త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతామని వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతామని, మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే సాధ్యమా లేదా చూడాలని పేర్కొన్నారు.