అమరావతి : గుడివాడ కేసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. ‘గుడివాడ కేసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారని… మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన కేసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 కేసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి” అని ప్రశ్నించారు. గుడివాడలో తనను ఓడించలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
గుడివాడ ప్రజలు అమాయకులు కాదని.. వారికి అన్ని విషయాలు తెలుసని కొడాలి నాని అన్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చేయడం అవివేకమని చెప్పారు. గుడివాడలో కేసినో వ్యవహారంపై త్వరలో బైడెన్కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. అని ఎద్దేవా చేశారు. గుడివాడలో మూడు రోజులు కేసినో జరిగితే 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారని…టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చానని.. వారికి చేతనైంది చేసుకోవాలని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.