AP News | టీడీపీ, జనసేన పొత్తులు కొత్త చిక్కులు తీసుకొస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంతంగా రెండు సీట్లు ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ కూడా రెండు సీట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన కాస్త టీడీపీ కార్యకర్తల్లో అలజడి సృష్టించింది. రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు విజయవాడలోని కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే టీడీపీ-జనసేన పొత్తులపై వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పటికే పవన్ ప్రకటనపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఉషశ్రీ చరణ్ తదితరులు స్పందించగా.. తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా విమర్శలు గుప్పించారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన 150 ప్రకటిస్తుందా?.. అంత ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 15 లేదా 20 సీట్లకు దిగజారి పవన్ కళ్యాణ్ పోటీచేస్తారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ను ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు తప్ప.. ప్రజలపై చిత్తశుద్ధి లేదని అన్నారు. ఇది కేవలం దిగజారుడు రాజకీయం మాత్రమే అని ఆయన విమర్శించారు. వైసీపీకి ఎవరితోనూ పొత్తు లేదని.. జనంతోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు.