విజయవాడ: మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్నది. కాగా, మైక్రో ఇరిగేషన్లో తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో వ్యవసాయ సాంకేతికత అమలుపై నాబార్డ్ పరిశోధక నివేదిక విడుదలైంది. నాబార్డ్ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. ఏపీలో మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం, కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్రలో 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్లో 22 శాతం మైక్రో ఇరిగేషన్ను అమలు చేస్తున్నాయి.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మైక్రో ఇరిగేషన్ కింద సాగు చేసే భూమి చాలా తక్కువగా ఉన్నదని నివేదిక పేర్కొన్నది. పంజాబ్లోని మొత్తం సాగు విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ ఇంప్లాంటేషన్ ఒక శాతం మాత్రమే. కాగా, పొరుగున ఉన్న హర్యానాలో ఇది 10 శాతంగా ఉన్నది. ఈ నివేదిక ప్రకారం, ఈ రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నప్పటికీ.. వాస్తవానికి నీటిని ఆదా చేయడంలో సహాయపడే మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీని ఉపయోగించడంలో ఈ రెండు రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వరి సాగు అధికంగా ఉండటం కూడా మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీని తక్కువగా వినియోగించటానికి కారణంగా భావించవచ్చు.
ప్రధానంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు మైక్రో ఇరిగేషన్ పథకాన్ని పునఃప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో నిర్ణయించింది. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇవ్వడాన్ని పొడిగించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన రైతులతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతులు సూక్ష్మ నీటిపారుదల పథకం పునరుద్ధరణతో లబ్ధి పొందుతారని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 4 నుంచి 4.5 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ పథకం కింద సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.