ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలో దిగి వరి నాట్లు వేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్ యార్డులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధుల పంపిణీ కార్యక్రమానికి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో పురిటిపెంట, మధుపాడ సరిహద్దుల్లోని పొలంలో దిగి వరినాట్లు వేశారు. అనంతరం రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గజపతినరంలో అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల దగ్గరికి వెశళ్లిన జగన్. కేజీకి, టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయం చేసేందుకు వైసీపీ నాయకులు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. రైతుల విషయంలో రాజకీయం చేయరాదని హితవుపలికారు. కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే ఉద్దేశపూర్వకంగా అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయం అంటే చంద్రబాబుకు చాలా ఇష్టమని వంగలపూడి అనిత అన్నారు. రీసర్వేలో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతన్నలు సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.