Vangalapudi Anitha | అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అని అనాలని అందరికీ కల ఉంటుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కానీ జగన్ పుణ్యమా అని వైసీపీ నంచి గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని వంగలపూడి అనిత తెలిపారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా చాక్లెటో.. బిస్కెటో కాదని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో చంద్రబాబును అవమానిస్తే, ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పలేదని అన్నారు.
గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేశారని వంగలపూడి అనిత గుర్తుచేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అయినా అసెంబ్లీకి పంపించాలని సూచించారు. జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగలేదని.. ఉన్న మంది రాజీనామా చేసి వెళ్లినా నష్టమేమీ లేదన్నారు. ఉప ఎన్నికల్లో ఉన్నవాళ్లు కూడా ఓడిపోతారని స్పష్టం చేశారు.