అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ తీవ్రంగా చర్చించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజధాని మార్చేందుకు కాని, మూడు రాజధానులుగా విభజించేందుకు శాసనాధికారం లేదని హైకోర్టు జడ్జిమెంట్పై ఆయన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య ఉన్న అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ ని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పేరుతో శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధిని స్పష్టంగా పేర్కొన్నారని లేఖలో వివరించారు.
శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు అని , దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్రావు లేఖపై బీఏసీలో చర్చిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రె డ్డి తెలిపారు. అసెంబ్లీ హక్కులపై చర్చించాలని శాసన సభ్యులు కోరుకుంటున్నారని ఆయన వివరించారు.