అమరావతి : ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna reddy) కి ఏపీ హైకోర్టు (High Court) పలు ఆదేశాలను కూడిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది. ఈనెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ రోజున నియోజకవర్గంలోని పాల్వాయిగేట్లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు వెబ్కాస్టింగ్లో నమోదు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించడంతో ఆయన రెండురోజులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు.
గురువారం అనుహ్యంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి జూన్ 6వ తేదీవరకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్కు ఏజెంట్ల నియామకానికి అభ్యర్థి తప్పనిసరిగా ఉండాలన్న ఎన్నికల నిబంధనలను అనుసరించి హైకోర్టు పిన్నెల్లిపై పలు ఆంక్షలు విధించింది . జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు సొంత నియోజకవర్గమైన మాచర్లకు వెళ్లవద్దని, నరసరావుపేట (Narsaraopeta) లో జరిగే కౌంటింగ్కు వెళ్లవచ్చని సూచించింది. అంతేకాకుండా బాధితులను బెదిరించవద్దని, ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని ఆదేశించింది.