అమరావతి : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ అఖిల ప్రియ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎటువంటి కారణాలు లేకుండా రాజకీయ వేధింపులతోనే కేసు నమోదు చేశారని న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం సీఆర్పీసీలోని సెక్షన్ 41 ఎ ప్రకారం విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
తొలుత ఆళ్లగడ్డలో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదుకాగా.. తర్వాత అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్తో పాటూ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఖాళీ స్థలంలో కట్టిన కాంపౌండ్ వాల్ కూల్చివేసి వాచ్మెన్పై దాడి చేశారని అఖిలప్రియ పెదనాన్న కుమారుడు కిషోర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసులపై అఖిలప్రియ హైకోర్టును ఆశ్రయించి.. ఆళ్లగడ్డలో నమోదైన కేసులను కొట్టేయాలని వేడుకున్నది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారం విచారణ జరుపాలని పోలీసులకు ఆదేశించింది.
మరోవైపు ఆళ్లగడ్డ పోలీసులపై జిల్లా ఎస్పీకి అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ, తమ అనుచరులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని నంద్యాలలో ఎస్పీని కలిసి విన్నవించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు అలా ప్రవర్తించకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తిచేశారు. ఆళ్లగడ్డలో బస్షెల్టర్ను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదుపై అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.