అమరావతి: ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నాటకాన్ని నిషేధించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఈ నాటకానికి ఎంతో విశిష్టత ఉందని, నిషేధం కారణంగా కళాకారులు ఇబ్బదులు పడుతున్నారని అన్నారు. ఓ వర్గానికి చెందిన వారు అభ్యంతరం తెలుపగా నాటకాన్ని నిషేధించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నాటకంలో ఒక పాత్ర బాగా లేకుంటే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాటకంలోని నవలని నిషేధించనప్పుడు నాటకాన్ని ఎలా నిషేధిస్తారని కూడా ప్రశ్నించింది. నాటకంపై అభ్యంతరాలను కోర్టుకు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, వచ్చే మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్పై విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.