అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించిని ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం వివరాలు సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బీ మోహన్కృష్ణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది వీ రమేశ్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ వేశారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపించారు. ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం.. ఏపీ విషయంలో హామీని నిలబెట్టుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ .. పలు రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పుడు ఏపీ విషయంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. విభజనతో ఏపీ నష్టపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున హరినాథ్ వాదనలు వినిపిస్తూ .. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఏపీకి భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడాలున్నాయన్నారు.