అమరావతి : ఏపీలోని గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ హైకోర్టు శుభవార్త చెప్పింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరుపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎంతో కాలంగా ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఉన్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్స్ సర్వీసుల్లో రీ వాల్యుయేషన్ లేదని, వాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరుగలేదని ఏపీపీఎస్సీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
గ్రూప్-1 పేపర్ల వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ పిటిషన్లపై హైకోర్టులో తుది విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని, కోర్టు తుది తీర్పునకు లోబడి నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల సమాధాన పత్రాలు, మార్కుల జాబితాను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గతంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మెయిన్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, ప్రశ్నపత్రాలను థర్డ్ పార్టీ తయారు చేసిందని, ఈ నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులను గతంలో విచారించిన కోర్టు తదుపరి విచారణలన్నింటినీ నిలిపివేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.