APPSC | అమరావతి : ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు యధావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరటనిచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.
2018 గ్రూప్-1 కింద 167 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడు సార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకేసారి మాత్రమే మాన్యువల్గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరు వర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
దీంతో ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో ఆందోళన మొదలైంది. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో మాన్యువల్గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్కు ఏపీపీఎస్సీ సమర్పించింది. వాటిని పరిశీలించిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.