Pinnelli Ramakrishna Reddy | నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎలాంటి నిర్ణయం చెప్పకుండానే వాయిదా వేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.
పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26న అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుల్లో దిగువ కోర్టులో రెండు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించే ఏ షరతులకు కట్టుబడి ఉంటానని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరి వచ్చే వారం పిన్నెల్లి బెయిల్ విషయంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.