అమరావతి: పారిశుద్ధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీఓ నంబర్ 233 ని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం వీరికి మూలవేతనంగా రూ.15 వేలు అందుతున్నది. ఈ పెంపుదలతో వీరి జీతం రూ.21 వేలకు పెరిగింది. తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేల మందికి పైగా కార్మికులు లబ్ధి పొందనున్నారు.
జీతాల పెంపుదలకు మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల సమ్మెకు దిగారు. డిమాండ్లలో ముఖ్యమైన ఆరోగ్య భృతిని వీరు ప్రస్తావించారు. కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. వారి డిమాండ్లకు ఓకే చెప్పడంతో కార్మికులు సమ్మె విరమించారు. సీఎం జగన్ వారి సమస్యలపై స్పందించి.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మరో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై అధికారులతో చర్చించి తగు విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. హెల్త్ అలవెన్స్ ఇచ్చేందుకు ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.