AP PRC Agitation Postpone | వేతన సవరణపై ఆందోళన బాట పట్టిన ఏపీ ప్రభుత్వోద్యోగ సంఘాలు కాస్త వెనక్కి తగ్గాయి. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు, డిమాండ్లు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆందోళన విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరామని అన్నారు.
ఈనేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మలతోనూ చర్చించామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలోకి వెళ్లామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు చెప్పారు. ఆర్థికేతర డిమాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా పీఆర్సీ ఖరారు, ఇతర డిమాండ్లపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు.