అమరావతి : కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇవాళ లేఖ రాసింది. శ్రీశైలం కుడిగట్టులో జల విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వాలని అభ్యర్థించింది. కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహం పెరుగుతున్నందున ఈ అంశాన్ని పరిశీలించాలని కోరింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 870 అడుగులకు చేరినందున విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. శ్రీశైలానికి భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. వారంపాటు ఇదే రీతిలో ప్రవాహం కొనసాగితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏపీకి విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు కేఎంఆర్బీ అనుమతించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.