అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన విద్యార్థులకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది. పాఠశాలలో మొన్న రాత్రి ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేయగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో రంజిత్నాయక్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఘటనపై స్పందించారు. పాము కాటుతో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల రూపాయలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం చేయిస్తామని భరోసా ఇచ్చారు.