అమరావతి: కలెక్టరేట్ల ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని యోచిస్తున్నది. జిల్లాకు చెందిన అన్ని ప్రధాన కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీనివల్ల భూమి అవసరంతోపాటు ఖర్చు కూడా బాగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఏర్పాటైన కొత్త జిల్లాల్లో పలు చోట్ల సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్లు ఏర్పాటయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. వాటన్నింటిని పరిశీలించి ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సమీకృత కలెక్టరేట్లను ఏ విధంగా నిర్మించాలనే విషయమై ఒక అవగాహనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అన్ని సేవలు ఒకేచోట నుంచి అందిస్తున్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ అంతా గ్రామ సచివాలయాల్లో కేంద్రీకృతమై ఉన్నది. అదేవిధంగా కొత్త జిల్లాల్లో అన్ని పరిపాలనా విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు డీఈవో, వ్యవసాయ జేడీ, సంక్షేమ శాఖల కార్యాలయాలు తీసుకురానున్నారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వం సేవలు ప్రజలకు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాలను మినహాయించి.. మిగతా 13 కొత్త జిల్లా కేంద్రాల్లో ఈ కలెక్టరేట్ సముదాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో అవసరమైన భూమిని గుర్తించినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఫార్సులు చేసేందుకు ఏర్పాటైన కమిటీల్లో రవాణాశాఖ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సమీకృత కలెక్టరేట్లపై సవివర నివేదిక ఇచ్చినట్లు సమాచారం.