అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహదారుడు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై పూటకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాలంటర్లను తొలగిస్తామని ఒకసారి, వారికి రూ. 10 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఓట్ల కోసం అబద్దపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల ఆపేందుకు అనేక కుట్రలు పన్నారని విమర్శించారు. చంద్రబాబు(Chandra Babu), పవన్కల్యాణ్ (Pawan Kalyan) వాలంటీర్ల వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలు మరిచిపోలేదని వ్యాఖ్యనించారు. 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మారలేదని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల (Volunteers) వ్యవస్థను తొలగించి జన్మభూమి కమిటీ సభ్యులకు బాధ్యత అప్పగించడం ఖాయమని అన్నారు.
ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందుతున్న ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో్ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత వైసీపీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే జగన్ అమోఘ విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు.