అమరావతి : ఏపీలో ఉద్యోగులకు 11 వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు తదితర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై పోరాటానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఆదివారం ఐక్యకార్యచరణ వేదిక పలు ఉద్యమ తేదీలను ఖరారు చేసింది.
డిసెంబర్ 1న ఏపీ సీఎస్కు నోటీసు, డిసెంబర్ 7నుంచి 10వ తేదీ వరకు అన్ని జిల్లాలో బ్లాక్ బ్యాడ్జీలతో ప్రదర్శన, 10న లంచ్ అవర్లో ప్రదర్శన, 13న నిరసన ర్యాలీ, అన్ని తాలూకాలు, డివిజన్లలో సమావేశాలు నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు. 16న డివిజన్, ఆర్టీసీ డిపోల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నాలు , 21న జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నామని ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు . ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రకటన చేస్తే ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉమ్మడి వేదిక ఒప్పుకోబోమని.. కేంద్ర డీఏలతో కలిపి బకాయిపడ్డ డీఎలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయన్నారు.