శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం క్షేత్రానికి వచ్చిన ఆయన దేవస్థానం పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. 260 గదుల నిర్మాణ భవన సముదాయాన్ని త్వరలో యాత్రికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్మాణపనులను వేగవంతం చెయ్యాలని ఈవో లవన్నను ఆదేశించారు. నూతన వాణిజ్య సముదాయంలో చేపట్టాల్సిన మార్పుచేర్పులు సూచించారు. అనంతరం లలితాంబికా వాణిజ్య సముదాయము, ఆలయ ప్రధాన వీధిలో పర్యటించి దుకాణాలను పరిశీలించారు. ఆలయ పరిసరాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ప్లాన్ అమలులో కలుగుతున్న ఆటంకాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుష్కరిణిలో నిర్మిస్తున్న నీరాజన మండపాన్ని పరిశీలించారు.
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్, కమిషనర్ జవహర్లాల్, ధర్మకర్తలమండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈఈ రామకృష్ణ, భాస్కర్, డీఈ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, సీఎస్వో నర్సింహారెడ్డి, నైన్ అండ్ నైన్ వెబ్ డెవలపర్స్ ఎండీ వంశీ దర్శించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న అర్చక వేదపండితులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర దీపాలంకరణ, పల్లకీసేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలో వేదపండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.