AP News | అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఇప్పటికీ జనసేనతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ చెప్పగా.. తాజాగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ కూడా నోరువిప్పింది.
మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో రాజీలేని పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. బీజేపీ భాగస్వాములు అయిన టీడీపీ, జనసేనపైనా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీతో వైసీపీ అనైతిక బంధంలో ఉందని ఆరోపించారు. ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తర్వాత ఏపీలోనూ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. షర్మిల రాకతో పార్టీ ఏపీలో పుంజుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్ ఒక క్లారిటీ ఇవ్వడం విశేషం.