విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అప్పులు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం.. అంకెల గారడీతో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచి ఆదాయాన్ని పెంచుకుంటున్నదని, అయితే సంక్షేమానికి మాత్రం ఖర్చు చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై సాకే శైలజానాథ్ తన ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. కేటాయింపులు, వాస్తవ వ్యయాలకు మధ్య పొంతన లేకపోయిందన్నారు. గత బడ్జెట్ వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లెఫ్ట్ రైట్ రుణాలను ప్రభుత్వం ఏం చేస్తుందో వెల్లడించాలని శైలజానాథ్ తన ప్రకటనలో ప్రశ్నించారు.
అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, దాని అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే తప్ప మరొకటి కాదని తెలిపారు. బడ్జెట్లో అమరావతి ప్రస్తావన లేకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గత మూడేండ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయడం లేదని శైలజానాథ్ మండిపడ్డారు.