YS Sharmila | భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్సభలో ప్రవేశపెట్టిందని అన్నారు. పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అని వ్యాఖ్యానించారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని షర్మిల తెలిపారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్సభలో ఓటింగ్తో తేలిందని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలని ప్రశ్నించారు. ఇందులో ఏమన్నా అర్థముందా అని మండిపడ్డారు. సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నించిందన్నారు. చివరకు ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని తెలిపారు.
రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని షర్మిల తెలిపారు. జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీల గడువును లోక్సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అని విమర్శించారు. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని తెలిపారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే బీజేపీ ఉద్దేశమని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదని స్పష్టం చేశారు.