Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు రావాలని ఏపీ సీఎం జగన్ను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ను ఆయన కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.
మంత్రి వెంట శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు ఉన్నారు. ఆహ్వాన పత్రిక అందజేసిన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్కు వేదపండితులు ఆశీర్వాదం అందజేశారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వారికి పండితులు వేద ఆశీర్వచనంతోపాటు శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.