AP CM Jagan | సోషల్మీడియా ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. సోషల్మీడియాలో వ్యవస్థ ఎంతగా దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనమని తెలిపారు. విశాఖపట్నంలోని ఆనందపురంలో మంగళవారం నాడు సోషల్మీడియా వారియర్స్తో ముఖాముఖిలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగనన్న చేసిన మంచి పనితో తాను బాగుపడ్డానని.. ఇంటి స్థలంతో పాటు వివిధ పథకాలు అందాయని తన సంతోషాన్ని సోషల్మీడియాలో పంచుకుంటే… గీతాంజలి అనే తన చెల్లిని ఎంతో దారుణంగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా వెళ్లిందంటే.. ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో అనడానికి ఒక నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఒకవైపు మీ జగన్ ఒంటరిగా ఉంటే.. మరోవైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని జగన్ అన్నారు. వీళ్లతో పాటు వీళ్ల కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇంతమందితో, ఇన్ని కుట్రలు, ఇబ్బందుల మధ్య మీ జగన్ ఒంటరిగా తట్టుకుని నిలబడగలుగుతున్నాడంటే.. దానికి కారణం సోషల్మీడియా అని చెప్పుకొచ్చారు. సెల్ఫోన్ చేతిలో ఉన్న ప్రతి చెల్లె, తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నారని అన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు.. జగన్కు రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని కోట్ల గుండెలు ఉన్నాయని అన్నారు. లక్షలాది గుండెలు తన కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఆ దేవుడి దయ మీద తనకు నమ్మకం ఉందని.. తనను ప్రేమించే గుండెల మీద తనకు నమ్మకం ఉందని తెలిపారు. మీకు ఎంత చేసినా.. ఏం చేయగలిగినా అది తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ వెనుక ఉన్నది ఒక జగన్ మాత్రమే కాదు.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ వెనుక ఉందని అన్నారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో అండగా ఉంటుందని తెలిపారు.