అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న మోసాన్ని ఉద్యోగ సంఘాలు గమనించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు సూచించారు. ఈరోజు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి ఉద్యోగులు కారణం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయంలో అధికశాతం ఉద్యోగులకే ఖర్చు అవుతుందని చేస్తున్న దుష్ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ఖండించారు.
ప్రభుత్వమే తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవస్థల వల్ల ప్రభుత్వానికి ఆర్థికబారం పడుతుందని పేర్కొన్నారు. తమ రాజకీయం కోసం లక్షా 25వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులను, 60వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం, రెండు లక్షల మంది గ్రామ వలంటీర్ల నియామకాలతో ప్రతి యేటా ప్రభుత్వానికి అదనంగా 6,200 కోట్లు బారం పడుతుందని అన్నారు. వీరికీ జీతాలు పెంచితే మరో 10వేల కోట్లు పెరుగుతుందని వెల్లడించారు.
ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొవాలో అనే అంశం ప్రభుత్వానిదేనని ఉద్యోగులది కాదని అన్నారు. ‘ ప్రభుత్వానికి ఖర్చులు పెరిగిపోతున్నాయని, జీతాలు ఇంతకంటే ఎక్కువ ఇవ్వమని సీఎం జగన్ అనడం ’ దిగజారుడికి నిదర్శనమని, ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు.