అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నాయుడు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ (TTD) 2025 నూతన క్యాలెండర్ను, డైరీని అందజేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి మేలు జరుగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
సీఎం రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెంట హోం మంత్రి వంగలపుడి అనిత తదితరులున్నారు. నూతన సంవత్సరం తొలిరోజు ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వివరించారు.