అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ (Warning) ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అడ్డు, అదుపులేకుండా ఆడపిల్లల వ్యక్తిగత విషయాలపై విష ప్రచారం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోమవారం గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
ఏపీలో సోషల్ మీడియాకు(Social Media) అడ్డుఅదుపులేకుండా పోయిందని , మధమెక్కి విచ్ఛలవిడిగా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు , రాష్ట్రంలోని మహిళలపై సోషల్ మీడియా ద్వారా పోస్టింగులు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
దేశంలో ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకుని చట్టాలను పకడ్బందీగా తయారు చేసి, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ అయినా హుందాతనంతో ఉండాలని , గౌరవంగా రాజకీయాలు చేయాలని సూచించారు. దానికి భిన్నంగా వైసీపీ శ్రేణులు ఆడపిల్లల జోలికి వస్తే వదలిపెట్టబోమని హెచ్చరించారు. ఎక్కడ వాతా పెట్టాల్లో అక్కడ పెడితేనే దారిలోకి వస్తారని అన్నారు.
నేరస్థులు రాజకీయ ముసుగులో ఘోరాలు, నేరాలు చేస్తూ నేడు వారే ప్రజాస్వామ్యమంటూ గగ్గోలు పెడుతుండడం అన్యాయమని పేర్కొన్నారు. కరుడు గట్టిన నేరస్థుడు అధికారంలో ఉంటే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఆలోచించుకోవాలని సూచించారు. రాజకీయాల్లో నాతో ఆటలాడుకుంటే వారిని వదలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
పోలీసులు అప్పర్హ్యండ్లా ఉండాలి
రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎప్పుడూ కూడా అప్పర్ హ్యండ్గా ఉండాలని చంద్రబాబు సూచించారు. నేరస్థులే పోలీసుకంటే మెరుగ్గా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని అన్నారు. నాగరికత ప్రపంచంలో శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధికి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ, పల్నాడు జిల్లాలో ఫ్యాక్సనిస్టును అరికట్టానని వివరించారు.