హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ అని, పండుగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పండుగకు వస్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారా అని విమర్శించారు.
ఏపీ సీఐడీ, సీఎం జగన్కు పండుగ రోజే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. పండుగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలన్నారు. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులను నమ్మే వ్యక్తినని, కరోనా ప్రొటోకాల్స్కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని వెల్లడించారు.
గతంలో తనను హింసించినప్పుడు కెమెరాలు ఎందుకు లేవన్నారు. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నామన్నారు. తనను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో తనకు తెలుసన్నారు. తనను ఎంతగా హింసించారో ప్రజలకు తెలియాలన్నారు. రావణరాజ్యంపై ప్రజలు విసుగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హీరో ఎవరో, కీచకుడెవరో తేలుద్దామన్నారు.
సునీల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం వచ్చిందని చెప్పారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారన్నారు. ఈ నెల 17న విచారణకు రావాలని తెలిపారన్నారు. గురువారం నరసాపురం వస్తున్నానని జిల్లా కలెక్టర్, ఎస్పీకి చెప్పానని వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎంపీ రఘురామకు పోలీసులు నోటీసులు జారీచేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు.