Margadarsi | హైదరాబాద్ : మార్గదర్శి చిట్ఫండ్ కేసులో ఏపీ ప్రభుత్వం రూ.1035 కోట్లను అటాచ్ చేసింది. రెండో జీవోల కింద ఈ మొత్తాన్ని అటాచ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏడీజీ సంజయ్ వెల్లడించారు. మార్గదర్శిలో అక్రమాలు, నిధుల తరలింపులకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
మార్గదర్శి చిట్ఫండ్ కేసుపై మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్ వెల్లడించారు. ఈ కేసును మార్చి 10వ తేదీ నుంచి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఏ1గా రామోజీరావు, ఏ2 శైలజా కిరణ్, ఏ3, ఏ4గా మార్గదర్శి ఫోర్మెన్, ఏ5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె.శ్రవణ్కుమార్లను నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.
మార్గదర్శి కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను విచారించినా.. వారు సహకరించడం లేదని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెక్కలు చూస్తే ఈ కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చని చెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇచ్చిన సమాచారంతో ఆడిటింగ్ చేశామని, 108 బ్రాంచ్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోందని.. ఈ నాలుగు రాష్ర్టాల్లో మార్గదర్శిని మూసేయించే పరిస్థితి రావొచ్చని తెలిపారు. విచారణ అనంతరం రెండు జీవోల ద్వారా ప్రభుత్వం రూ.1035 కోట్లు అటాచ్ చేసినట్లు తెలిపారు. సంస్థకు ఆస్తులు, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నారు.