అమరావతి : ఏపీ కేబినెట్(AP Cabinet ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గంలో ప్రధానంగా ప్రధాని మోదీ పొదుపు చర్యలపై చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వాహనాల శ్రేణిని, వాహనాల వాడకాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి కోరారని మంత్రి పార్థసారథి ( Minister Parthasarathi ) వెల్లడించారు.
రాష్ట్రంలో సైకిళ్ల వాడకాన్ని పెంచాలని, లేదా పాదయాత్రగా సమీప ప్రాంతాలకు వెళ్లాలని, వారానికి ఒకరోజు నో వెహికల్ ఫ్రై డే ( No-Vehicle Day ) ను పాటించాలని , ఈవీ వాహనాలను వాడేవారిని ప్రోత్సహించాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోంపై సాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారని వెల్లడించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజారవాణాను ప్రోత్సహించాలని, విదేశి పర్యటనలను తగ్గించుకోవాలని సూచించారని ఆయన తెలిపారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 40కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ అనుమతించింది.