అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అదేవిధంగా వచ్చే నెల 4 న ప్రారంభం కావాల్సిన పాఠశాలల సెలవులను ఒక్కరోజు పొడగించారు. ఈ రెండింటి వాయిదాలకు కారణాలు ఏమైనప్పటికీ.. ప్రభుత్వంపై నెటిజెన్లు మాత్రం ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. వాయిదాల ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
ఈ నెల 22న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశాన్ని జగన్ సర్కార్ వాయిదా వేసింది. రెండు రోజుల తర్వాత అంటే 24 న క్యాబినెట్ భేటీ ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు.
మరోవైపు, ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం కూడా వాయిదా పడింది. నిజానికి స్కూళ్లు వచ్చే నెల 4 న తెరుచుకోవాలి. అయితే, అదేరోజు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నందున.. స్కూళ్ల తొలిరోజును సెలవుగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం స్కూళ్లు జూలై 4 న తెరుచుకోవాలి. అయితే, మోదీ భీమవరం పర్యనను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 4 న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించి అబాసుపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రభుత్వం వాయిదా వేస్తుండటంతో నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వాయిదాల ప్రభుత్వంతో అన్నీ వాయిదా పడుతున్నాయని కామెంట్లు రాస్తున్నారు.