అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ క్రమబద్ధీకరణ సవరణ బిల్లును మంత్రి పేర్నినాని బుధవారం సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్లో ఇకనుంచి టికెటింగ్కు అనుమతి లేదు. సీఎం వైఎస్ జగన్ తరఫున బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.
ఇకపై సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించనుంది. రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు నిబంధన విధించారు. బెనిఫిట్ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేయనున్నారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్లను పెంచుతూ సవరించారు. కొత్త వాహనాలకు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు లైఫ్ ట్యాక్స్ పెంచారు. దీంతో ప్రజలపై రూ.409 కోట్ల అదనపు భారం పడనుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు రూ.4వేల నుంచి రూ.6 వేల వరకు గ్రీన్ టాక్స్ విధిస్తున్నట్లు చెప్పారు.