Thota Chandrasekhar | పేద ప్రజల హృదయాల్లో దివంగత వంగవీటి మోహనరంగ చిరస్థాయిగా నిలిచిపోయారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రంగ 76వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో రంగ జయంతి వేడుకలు నిర్వహించారు. రంగ చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని దుష్ట శక్తులు రంగ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, రాజకీయ ఎదుగదలను చూసి ఓర్వలేక ఆయన్ను అత్యంత పాశవికంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడ్డ విజయవాడ జిల్లాకు రంగ పేరు పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం ఆయన్ను నిర్లక్ష్యం చేసిందన్నారు.
రంగ ఆశయ సాధనకు కేసీఆర్ సారధ్యంలో కులమతాలకతీతంగా బీఆర్ఎస్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గాజులరామారం కార్పొరేటర్ శేషగిరిరావు, రంగా అభిమానులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు గుంటూరులోని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో నాయకులు షేక్ ఖాజావలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖాజావలి మాట్లాడుతూ రంగ పేదల పక్షాన నిరంతరం పోరాడి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆలమూరు రఫీ, షేక్ కుదీర్, ఎం ప్రసాద్, షేక్ షాకీర్, షేక్ నాగూర్ వలి, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు షేక్ సిరాజ్ పాల్గొన్నారు.