విశాఖపట్నం : మన దేశానికి బద్ధ శత్రువైన పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెవులు మూసుకున్నారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో మతతత్వ శక్తులు అంతగా బరితెగించినా ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మతతత్వ శక్తులను వెనకేసుకొస్తున్న సీఎం జగన్ ఖబడ్దార్ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జోనల్ సమావేశానికి హాజరైన సోము వీర్రాజు.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
రానున్న ఎన్నికలకు బీజేపీ బలీయమైన నిర్మాణాత్మక శక్తిగా ఎదుగుతుందని సోము వీర్రాజు చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలతో తమ పార్టీకి పొత్తులుండవన్నారు. ఉత్తరాంధ్రలో పెరిగిపోయిన తాగునీటి సమస్యపై పోరాటం చేస్తే ప్రభుత్వం పరుగు పెడుతున్నదని దుయ్యబట్టారు. త్వరలో రాయలసీమ ప్రాజెక్టులపై ఉద్యమం చేపడతామని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు అందిస్తున్నదని, అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం వాటికి రంగులద్ది తమవిగా ప్రచారం చేసుకుంటున్నదని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఇలా రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైందన్నారు. హౌసింగ్ కోసం సబ్సిడీలు కేంద్రం ఇస్తున్నా అవి లబ్ధిదారులకు చేరడం లేదని, వీటి కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలను సబ్సిడీల రూపంలో ఇస్తున్నదని, ఒక్క బియ్యం సబ్సిడీ కిందనే రూ.25 వేల కోట్లు ఇచ్చారని వీర్రాజు గుర్తుచేశారు. పార్టీ జాతీయ స్థాయి నాయకులు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నేతలకు పలు సూచనలు చేయడమే కాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.