అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఏడో రోజు ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. వారి నినాదాలతో సభ మార్మోగిపోయింది. దాంతో టీడీపీ సభ్యులు 11 మందిని మరోసారి స్పీకర్ ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
అసెంబ్లీ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం పలు శాఖల బడ్జెట్ డిమాండ్లపై చర్చించనుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. రోజూ సభను అడ్డుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు. అనంతరం వారిని సభ నుంచి సస్పెండ్ చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు అశోక్, రామ్మోహన్, భవానీ, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్, సాంబశివరావు, సత్య ప్రసాద్ సస్పెన్షన్కు గురయ్యారు.