Tirumala | తిరుమల నడకమార్గంలో గతకొద్ది రోజుల నుంచి చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమలలో తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో నంబర్ మైలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దాదాపు రెండు నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. చిరుతలను పట్టుకునేందుకు పలు మార్గాల్లో బోన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తొలుత ఒక చిరుతను బంధించగా.. ఆ తర్వాత మరో రెండు చిరుతలు, ఇప్పుడు మరొకటి బోనులో చిక్కింది. ప్రస్తుతం చిక్కిన నాలుగో చిరుతను బంధించేందుకు గత వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేశారు. రోజూ బోను వరకు వచ్చి చిరుత వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు అలిపిరి కాలిబాట సమీపంలో తిరుగుతున్న చిరుతలను బంధించామని, వర్షాల కారణంగా ఐదు రోజులుగా ఎలుగుబంటి సంచారం లేదని సీసీఎఫ్ నాగేశ్వర రావు తెలిపారు. శ్రీవారి మెట్లు, అలిపిరి కాలిబాటలో వచ్చే భక్తులకు ప్రమాదకరంగా తయారైన చిరుతలను బంధిస్తామన్నారు. కాలిబాటలో శాశ్వతంగా 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్య ప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.
కొద్ది రోజుల క్రితం చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి లక్షితపై దాడి చేసింది చిరుతేనని.. కానీ ఏ చిరుత అనేది ఇంకా తేలలేదని చెప్పారు. ఘటనా స్థలంలో చిరుత వెంట్రుకలు లభ్యమయ్యాయని, పట్టుకున్న చిరుతల్లో ఏది అనేది తేలలేదన్నారు. ఏ చిరుత దాడిచేసిందో వైద్యపరీక్షల నివేదికలో తెలుస్తుందని పేర్కొన్నారు.
తిరుమల నడకమార్గాల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని అన్నారు. భక్తుల భద్రతా దృష్ట్యా దీర్ఘకాలిక ప్రణాళిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడకమార్గాల్లో, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. కెమెరా ట్రాప్లలో ప్రస్తుతానికి ఇంకే చిరుతలు కనబడలేదని చెప్పారు.ప్రసుత్తం ఏడో మైలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద అటవీ ప్రాంతంలో చిక్కిన చిరుతను తిరుపతి ఎస్వీ జూ పార్కుకు అటవీ శాఖ అధికారులు తరలించారు. చిరుత రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జూ క్వారంటైన్లో ఇటీవల పట్టుబడిన 2 చిరుతలు ఉన్నాయన్నారు.