అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల్లో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది . సముద్రంలో మరో మృతదేహాన్ని గుర్తించిన గజ ఈతగాళ్లు ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా కోట శివగా అతడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. మరో యువకుడు అజీజ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన 8మంది యువకులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సరదా కోసం విశాఖ ఆర్కే బీచ్కు చేరుకున్నారు. స్నానాల కోసం వీరిలో కొందరు సముద్రంలోకి వెళ్లగా అలల ఉద్ధృతికి ముగ్గురు కొట్టుకుపోయారు. గమనించిన తోటి స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు సముద్రంలోకి దూకి సీహెచ్ శివను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొన ఊపరితో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు కే. శివకుమార్, అజీజ్ ఆచూకీ కోసం గాలించగా అప్పటికే చీకటి పడడంతో సహాయక చర్యలను నిలుపుదల చేశారు.
సోమవారం ఉదయం 6 గంటల నుంచి సహాయక చర్యలు తిరిగి ప్రారంభించారు. మద్యాహ్నం సంఘటన స్థలానికి కొద్దిదూరంలో కోట శివ మృతదేహం లభ్యం . అజీజ్ మృతదేహం కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడి మృతదేహం కూడా కోట శివ మృతదేహం లభించిన చోటనే దొరకవచ్చని, సాయంత్రం వరకు అజీజ్ మృతదేహం దొరికే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.