ఒక్క మంత్రివర్గ కూర్పు.. నెల్లూరు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి పారేసింది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నెల్లూర్ టాప్. మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నూతన మంత్రి కాకాణి గోవర్ధన్.. ఈ ముగ్గురూ ఇప్పుడు బాగా ప్రచారంలో వున్నారు. ఇంకో విచిత్రం ఏమంటే.. ఈ ముగ్గురికీ.. ఒక్కరంటే ఒక్కరు అస్సలు పడదు. ముగ్గురు దారులూ వేరు. కానీ.. ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణలో కాకాణి గోవర్ధన్ బెర్త్ దక్కించుకున్నారో.. ఈ పాత రాజకీయం మారిపోయి.. కొత్త రాజకీయం వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ యాదవ్కు కూడా పడదు. కానీ.. కాకానిని ఎదుర్కోడానికి ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. నెల్లూరు రాజకీయాల్లో తాజా ట్విస్ట్ ఇదే.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ కార్యక్రమం అన్న ప్రోగ్రాం చేస్తున్నారు. దీనికి సంఘీభావం తెలుపడానికి వచ్చానంటూ అనిల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి అందరూ శ్రమించాలని, 2024 ఎన్నికల్లోనూ కోటంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని కూడా ఆకాంక్షించారు.
ఇక తాజా మంత్రి కాకాణికి, మాజీ మంత్రి అనిల్కు అస్సలే పడదు. కాకాణికి మంత్రి పదవి దక్కగానే మాజీ మంత్రి అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి తనకు ఎంతైతే సహకరించారో, దానికి డబుల్ సహకారం అందిస్తానని, డబుల్ ప్రేమను పంచుతానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనిల్ మంత్రిగా వున్న సమయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ ఏమాత్రం సహకరించలేదని, ఆ కోపంతోనే అనిల్ ఇలా మాట్లాడారని ఆయన వర్గీయులు అంటున్నారు.
అనిల్ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తోంది. మంత్రి హోదాలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ నెల 17 న జిల్లాకు వస్తున్నారు. ఆయన వర్గీయులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అయిపోయారు. ఇదే సమయంలో.. మాజీ మంత్రి అనిల్ యాదవ్ కూడా అదే రోజు తన మద్దతుదారులతో భారీ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బహిరంగంగానే వారిద్దరూ సవాల్ను విసురుకున్నట్లైంది. ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా? లేదంటే పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి, సర్దుబాటు చేస్తుందా? అన్నది మాత్రం చూడాల్సి వుంది.