తిరుమల : టీటీడీ ఈవో (TTD EO) గా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్( Anil Kumar Singhal ) అన్నారు. టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ ( TTD ) బోర్డు మెంబెర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియోగా కూడా ప్రమాణం చేశారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు.
మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుంచి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ప్రశాంతి, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన ఈవో అశోక్ కుమార్ సింఘాల్ టీటీడీ చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ చైర్మన్ శాలువతో సన్మానించారు.