తిరుమల : టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో వీరబ్రహ్మం సింఘాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు గుండెపోటుతో మరణించడంతో ఆయన జనవరి 2 వరకు సెలవులో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో అనిల్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుమలలో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,145 మంది భక్తులు దర్శించుకోగా 22,411 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందని తెలిపారు. కాగా ఈరోజు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.