అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం వద్ద మార్కాపురం సబ్ కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సబ్కలెక్టర్ శేతుమాధవన్తో పాటు కారు డ్రైవర్, మరొకరికి గాయాలు అయ్యాయి.
మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న సబ్ కలెక్టర్ వాహనాన్ని టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చీమకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వారిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.